మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం
కర్నూల్ లో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ


మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం.. టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన
“రాజకీయ పావులుగా మమ్మల్ని చేయొద్దు”.
కర్నూలు ప్రతినిధి ఆగస్టు 8 యువతరం న్యూస్ :
మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఉపాధ్యాయులు కర్నూలులో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. చారిత్రక కొండారెడ్డి బురుజు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు ఎక్కి తమ నియామకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
తమ నియామకాలపై వాస్తవాలను పలుమార్లు వివరించినప్పటికీ పదేపదే రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల ఉపాధ్యాయ కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని వారు పేర్కొన్నారు. “టీచర్లుగా పాఠాలు చెబుతాం.. మా నియామకాలపై కుట్రలు చేస్తే గుణపాఠం కూడా చెబుతాం” అంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయ నియామకాలను రాజకీయాల్లోకి లాగి తమను పావులుగా మార్చవద్దని వైసీపీకి హితవు పలికారు.
“మెగా డీఎస్సీ నియామకాలపై కుట్రలు చేయొద్దు.. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో తమ నియామకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. తమ ఉద్యోగాల విషయంలో రాజకీయ జోక్యం, నిరాధార ఆరోపణలను సహించేది లేదని హెచ్చరించారు.



