ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు

ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు
పామిడి, సెప్టెంబరు 9 యువతరం న్యూస్:
పెన్నా నది నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను వంకరాజుకాలువ గ్రామస్థులు మంగళవారం అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ టిప్పర్లకు ఎదురుగా బైఠాయించారు. ఇసుక తరలింపుతో తాగు, సాగునీటి వనరులు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో ఇటీవల రూ.కోటి వ్యయంతో నిర్మించిన తారురోడ్డు మీదుగా భారీ టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో రహదారి గుంతలమయంగా మారిందని గ్రామస్థులు తెలిపారు. మరోవైపు టిప్పర్ డ్రైవర్లు.. జాతీయ రహదారి-44 అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలిస్తున్నామని గ్రామస్థులకు వివరించారు. అయితే జాతీయ రహదారి పనుల పేరుతో ఇసుకను గుంతకల్లుకు తరలించి విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
కలెక్టర్ అనుమతులు తప్పనిసరి ఈ విషయంపై గ్రామస్థులు సీఐ శివశంకర్నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. ఇసుక రవాణాదారులు ఎన్హెచ్ విజయవాడ అధికారులతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను చూపించారని తెలిపారు. అయితే ఎన్హెచ్ అధికారులతో ఉన్న ఒప్పంద పత్రాలు మాత్రమే సరిపోవని, ఇసుక తరలింపునకు కలెక్టర్ నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుందని రవాణాదారులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. కలెక్టర్ అనుమతులు పొందిన తర్వాతే ఇసుకను తరలించాలని సూచించామని, అనుమతులు లేకుండా రవాణా చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించినట్లు సీఐ వివరించారు.



