నల్లమల నుంచి గిన్నిస్ వేదిక దాకా
లింగాల విద్యార్థులను ప్రపంచ స్థాయికి చేర్చిన ముకేశ్ మాస్టర్ కృషి

నల్లమల నుంచి గిన్నిస్ వేదిక దాకా
లింగాల విద్యార్థులను ప్రపంచ స్థాయికి చేర్చిన ముకేశ్ మాస్టర్ కృషి
నాగర్ కర్నూల్ ప్రతినిధి ఏప్రిల్ 28 యువతరం న్యూస్ :
నల్లమల్ల ప్రాంతంలోని మారుమూల గ్రామమైన లింగాల నుంచి గిన్నిస్ బుక్ స్థాయికి ఎదగడం విశేష గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన భారీ కరాటే ప్రదర్శనలో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు కావడంతో పాటు, లింగాల మండలానికి చెందిన విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా చాటుకున్నారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు 10 రాష్ట్రాల నుంచి 1212 మంది ఒకే వేదికపై 11 నిమిషాల పాటు కరాటే ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రత్యేకంగా కరాటే మాస్టర్ ముకేశ్ ఆధ్వర్యంలో లింగాల మండల కేంద్రంలో గత సంవత్సరం కాలంగా క్రమశిక్షణతో సాగుతున్న శిక్షణ ఫలితంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఈ స్థాయికి చేరుకోవడం ప్రశంసనీయం. నల్లమల్ల అడవుల మధ్య ఉన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఈ విద్యార్థులు జాతీయ స్థాయి వేదికపై నిలబడటం ముకేశ్ మాస్టర్ కృషికి నిదర్శనంగా నిలిచింది. చిన్నారుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తూ ముకేశ్ మాస్టర్ అందిస్తున్న శిక్షణకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన పట్టుదలతో గ్రామీణ విద్యార్థులను గిన్నిస్ రికార్డు వేదిక దాకా తీసుకెళ్లడం విశేషమని అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు.



