మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం


మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయం
బట్టలు పెట్టి పట్టాలిస్తానన్న ప్రధాన హామీని నెరవేర్చా
మంగళగిరి ప్రజలు ఇచ్చిన బలమే ముందుకు నడిపిస్తోంది
ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా కూటమి అడుగులు
మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
మంగళగిరి ప్రతినిధి జులై 22 యువతరం న్యూస్:
మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తా, అన్నిరంగాల్లో మంగళగిరి నెం.1గా నిలబడాలి. భారతదేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలన్నదే తన ధ్యేయమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సికె కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన సభలో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకమయ్యారు. 2019 ఎన్నికల్లో నేను స్థానిక ప్రజలను అర్థం చేసుకునేలోపు ఎన్నికలు అయిపోయాయి, ఫలితంగా 5,300 ఓట్లతో ఓడిపోయాను. రెండురోజులు బాధపడినా మీ మనసు గెలవాలని ఆనాటి నుంచి నా ప్రయాణం ప్రారంభించా. ఐదేళ్లలో ఎప్పుడు ఎవరిని కలిసినా మా భూమికి శాశ్వత హక్కు కావాలని అడుగుతూ వచ్చారు. ఒకేసారి అందరి భూములను రెగ్యులరైజ్ చేయలేను, అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పాను. ఈరోజు 3వేలమందికి శాశ్వత పట్టాలు అందజేస్తున్నాం. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎవరు వచ్చి తమ ఇళ్లు, స్థలాలు లాగేసుకుంటారోనని భయంతో బతికారు, ఈరోజుతో ఆ భయం పోతుంది, భూమిపై శాశ్వత హక్కును కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. సుమారు వెయ్యికోట్ల విలువైన భూమిని ఈరోజు అందిస్తున్నాం. మీ భూమిని ఇకపై కుటుంబ అవసరాలకు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఎవరు వచ్చినా మీ భూమిని తీసుకోలేరు.
మీరిచ్చిన బలమే ముందుకు నడిపిస్తోంది
2019 ఎన్నికల తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. కొడుకును గెలిపించుకోలేకపోయావని కొందరు మా నాన్నను అవమానించారు. ఎన్నికలకు ముందు నేను గతంలో ఓటమిపాలైన 5300 పక్కన ఒక్క సున్నా పెట్టి గెలిపించమని చెప్పా. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో టాప్ -3 మెజారిటీ ఇచ్చారు. మీరిచ్చిన బలమే ఇప్పుడు నన్ను ముందుకు నడిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండిలా సాగుతున్నాయి. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24గంటలు తాగునీరు, పార్కులు, శ్మశానాల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రస్థాయిలో 4వేల పెన్షన్, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నక్యాంటీన్లు వంటివి అమలు చేస్తున్నాం. ప్రజలంతా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో రాష్ట్ర ఆదాయం రూపాయి అయితే ఖర్చు 1.60పైసలు ఉండేది. గత రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడి పరిశ్రమలు తెచ్చి, ఆగిపోయిన పనులు ప్రారంభించాం. ఇప్పటికీ రూపాయి ఆదాయానికి ఖర్చు 1.40పైసలుగా ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
ఎన్నికల సమయంలో బట్టలు పెట్టి పట్టాలిస్తానన్న ప్రధాన హామీని నేడు నెరవేర్చా. ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కలసికట్టుగా పనిచేస్తున్నాయి. డిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం అవసరం. ప్రధానిమంత్రి మోదీజీ అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కల నెరవేర్చారు. పోలవరం, అమరావతికి నిధులిచ్చారు. అమరావతికి చట్టబద్ధత కల్పించారు. బాబుగారిని తప్పుడు కేసులో జైలుకు పంపినపుడు అన్నగా నిలబడతా అని పవనన్న భరోసా ఇచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేందుకు అందరం కలసి పనిచేస్తున్నాం. మీరిచ్చిన బాధ్యతను పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నాం. అభివృద్ధి, సంక్షేమంతో పాటు మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నా. మంగళగిరి అభివృద్ధికి అన్నివిధాలు సహాయ, సహకారాలు అందిస్తున్న మోదీజీ, చంద్రబాబు, పవనన్నకు ధన్యవాదాలు. పట్టాల పంపిణీకి ముందుకు మూడు పార్టీల నాయకులు మీ ఇళ్లకు వచ్చారు. ఒక కప్పు కాఫీ కూడా తీసుకోలేదు. పారదర్శకంగా వాస్తవ లబ్ధిదారులకు ఈరోజు పట్టాలు పంపిణీ చేస్తున్నాం, మీ అందరి కోసం పనిచేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్ధయ్య, జనసేన ఇన్చార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నేతలు పోతినేని శ్రీనివాసరావు, వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.



