

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి అనగాని సత్యప్రసాద్
రేపల్లె జూలై 14 యువతరం న్యూస్:
ప్రజలకు సత్వర సేవలు అందించడం, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు అందించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం ద్వారా పారదర్శక పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. “ఇది కేవలం మాటల ప్రభుత్వం కాదు. ప్రజలకు పూర్తి జవాబుదారీగా వ్యవహరిస్తూ, వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు నిరంతరం కృషి చేస్తాం” అని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



