కాజలో వేడుకగా ఏరువాక పౌర్ణమి

కాజలో వేడుకగా ఏరువాక పౌర్ణమి
భక్తిశ్రద్థలతో విఘ్నేశ్వరుని దర్శించుకున్న అన్నదాతలు
ఉండ్రాళ్ల ప్రసాదాన్ని పంపిణీ చేసిన పెదకాపులు
మంగళగిరి ప్రతినిధి జూన్ 11 యువతరం న్యూస్:
ఏరువాక పండుగను మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలోని కాజ రైతులు మంగళవారం సాయంత్రం సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్థలతో ఆనందోత్సాహల మధ్య జరుపుకొన్నారు. కులవర్గ రహితంగా జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున ఏరువాక జరుపుకోవడం కాజలో పూర్వంనుంచి ఆనవాయితీగా వస్తోంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఈ ప్రాంత ఆడపడుచులు కుటుంబాలతో సహ ఏరువాక ఉత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. ఏరువాక ఉత్సవంతో కాజలో కోలాహలం నెలకొంది.ఆలయ పరిసరాలన్నీ భక్త జనులతో నిండి పోయాయి.
కాజలోని అగస్తేశ్వరస్వామి (శివాలయం) ఆలయ ప్రాంగణంలోని రత్న గర్భ విఘ్నేశ్వరస్వామి విగ్రహం వద్దకు స్థానికులందరూ తరలివచ్చి పూజలు నిర్వహించి టెంకాయలు సమర్పించారు. స్వామి వారికి మొదట నైవేద్యం పెట్టి ఆ ఉండ్రాళ్ల ప్రసాదాన్ని పెదకాపులు సింహాద్రి వెంకటరామారెడ్డి, కుక్కల కోటేశ్వరరావు, బొమ్ము పిచ్చిరెడ్డి, చెన్నం శ్రీనివాసరావులు స్వహస్తాలతో భక్తులకు పంపిణీ చేశారు. ఉండ్రాళ్ల ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు పోటీపడ్డారు.
ఇక్కడ విఘ్నేశ్వరుని గుడికి నాలుగువైపులా ఉన్న నాలుగు స్తంభాలు… ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకలని గ్రామస్థుల విశ్వాసం. గ్రామపెద్దలు (పెదకాపులు) ఏరువాక పర్వదినాన ఈ స్తంభాలను అధిరోహించి ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రసాదాలు స్వీకరించిన వారికి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని ఈ ప్రాంత వాసుల ప్రగాఢ నమ్మకం. ఈ ఏడాది స్వామి వారికి రుద్రాక్షలతో అలంకరణ,పూజ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
విఘ్నేశ్వరుని సన్నిధిలో వృషభ పూజ జరిపి ట్రాక్టర్లు, నాగళ్లు, ఎడ్ల బండ్లు, వ్యవసాయ ఉపకరణాలు, అరకలు కట్టి పసుపు, కుంకుమలు రాసి గుడివద్దకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏరువాక సాగారోరన్నో.. చిన్నన్నా అంటూ రైతులు ఉత్సాహభరిత వాతావరణంలో లాంఛనంగా దుక్కి దున్నారు. పంటలు బాగా పండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మొక్కుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రైతులు మారెళ్ల సత్యమారెడ్డి చక్రపొంగలి, పులిహోర,బొమ్ము పిచ్చిరెడ్డి, శ్రీనివాసరెడ్డి లడ్డు, వడ ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.
ఏరువాక ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి బారులు తీరి విఘ్నేశ్వరుని సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి ఉత్సవాన్ని తిలకించేందుకు మంగళగిరి, కాజ పరిసర గ్రామాల ప్రజలు కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఏరువాక పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బాలభక్త బృందం బజన సమాజం, కాజలోని కోలాట బృందం, బాలల సంఘం, ప్రజాసాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాయి.విద్యుత్ ప్రభ విశేష ఆకర్షణగా నిలిచింది. కాజలో ఏరువాక ఉత్సవం తిరునాళ్లను తలపించింది.ఎ ఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చందు,టీడీపీ నేతలు గాదె పిచ్చిరెడ్డి, కళ్లం రాజశేఖర రెడ్డి,పల్లబోతుల శ్రీనివాసరావు,తోట పార్థసారధి, నందం అబద్దయ్య,వివిధ పార్టీల నేతలు పాల్గొని పూజలు జరిపారు.