అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కౌలు పొలంలో
గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి
కొత్తపల్లి జూలై 30 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండలంలోని కొత్త మాడుగుల గ్రామంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విషాదం నింపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
గ్రామానికి చెందిన ఈడిగ బాలస్వామి వయస్సు (50) తండ్రి చంద్రయ్య. ఆయనకు సొంతంగా 2 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం గ్రామంలోని రైతుల వద్ద మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నారు.ఈ సంవత్సరం కూడా మొక్కజొన్న సాగు చేసారు. కానీ వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి నష్టపోయారు.ఇప్పటికే గతంలో చేసిన సుమారు రూ.15 లక్షల అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చలేనేమోనన్న భయంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు.మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో బాలస్వామి తాను కౌలుకు తీసుకున్న పొలం దగ్గరికి వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం.బాలస్వామి మరణించాడు. మృతుడి కుమారుడు విక్రమ్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామ్ నాయక్ తెలిపారు
ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలస్వామి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



