ఈనెల 16వ తేదీ పదివేల మందితో యోగ నిర్వహణ

ఈనెల 16వ తేదీ పదివేల మందితో యోగ నిర్వహణ
సోమవారం ఉదయం 10:30 గంటలకు పిజిఆర్ఎస్
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో జూన్ 13 యువతరం న్యూస్:
యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీ నంద్యాల పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పదివేల మందితో యోగ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆర్డీఓ, డిఎంహెచ్ఓ, డిఎస్డిఓ, సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ సోమవారం నాడు పెద్ద ఎత్తున జరిగే యోగా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సచివాలయ సిబ్బంది నుండి మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములై యోగా అభ్యాసాలు అవలంబించాలన్నారు. యోగ నిర్వహణ నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 10:30 గం.లకు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ పేర్కొన్నారు.