చంద్రబాబు నాయుడు రెండు రోజుల సిఐడి కస్టడి
నో థర్డ్ డిగ్రీ, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారణ

రెండు రోజుల సీఐడీ కస్టడీ ఇలా..
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే
గంటకోసారి అయిదు నిమిషాల విరామం
నో థర్డ్ డిగ్రీ
తెదేపా అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే.
నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న ఆయన్ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించనున్నది.
గంటకోసారి అయిదు నిమిషాల విరామం
శని, ఆదివారాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారణ జరగనున్నది. గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశం ఉంది.
అయిదు రోజుల కస్టడీకి సీఐడీ పెట్టు
చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయాధికారి ఈ మేరకు తీర్పు వెలువరించారు.
నో థర్డ్ డిగ్రీ
చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలి. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్కవర్లో న్యాయస్థానానికి సమర్పించాలి.
కనిపించే దూరంలో న్యాయవాది
విచారణ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని విచారణ కనిపించే దూరం వరకూ అనుమతించాలి. మధ్యాహ్నం గంటపాటు భోజన విరామమివ్వాలి. విచారణ సమయంలో అవసరమైన వైద్య సదుపాయం కల్పించాలి అని న్యాయస్థానం ఆదేశాల్లో ఉంది. కస్టడీ గడువు ముగిశాక ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా చంద్రబాబును న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి
సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించినప్పుడు సాక్షి కెమెరామన్, వీడియోగ్రాఫర్ చిత్రీకరించి వాటిని బయటకు విడుదల చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పత్రికల క్లిప్పింగ్లను న్యాయస్థానానికి సమర్పించారు. విచారణ వీడియోలు, ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు విడుదల చేయొద్దని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది.
శత్పతి కేసులో లాగే
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందినీ శత్పతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను విచారణ సమయంలో పాటించేలా సీఐడీని ఆదేశించాలని దమ్మాలపాటి విన్నవించగా… సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏడుగురు న్యాయవాదులు
సీఐడీ విచారణ జరిగేటప్పుడు చంద్రబాబు తరఫున హాజరయ్యేందుకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను న్యాయస్థానానికి సమర్పించారు. వీలును బట్టి వారిలో ఎవరో ఒకరు హాజరవుతారని న్యాయస్థానానికి చెప్పగా.. కోర్టు దానికి సమ్మతించింది. సీఐడీ తరఫున విచారణ జరిపే అధికారులు, మధ్యవర్తుల పేర్లను ప్రభుత్వ న్యాయవాదులు న్యాయస్థానానికి సమర్పించారు.