గృహాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా


గృహాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
ధూళిపూడిలో రూ.4.5 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్కు శంకుస్థాపన
రేపల్లె జూన్ 16 యువతరం న్యూస్:
గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గ పరిధిలోని నగరం మండలం ధూళిపూడి గ్రామంలో రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్యలను నివారించి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ధూళిపూడి గ్రామానికి ఈ సబ్స్టేషన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనగాని కృతజ్ఞతలు తెలిపారు. సబ్స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ధూళిపూడి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు లో ఓల్టేజీ సమస్యలు తగ్గుముఖం పడతాయని మంత్రి అనగాని పేర్కొన్నారు. రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు గృహాలకు నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్ వి కె ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.



