జగన్ అవినీతి వల్లే విద్యుత్ చార్జీల పెంపు: ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్

జగన్ అవినీతి వల్లే విద్యుత్ చార్జీల పెంపు
చార్జీలు పెంచింది మీరే, ధర్నాలు చేసేది మీరేనా
ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
పత్తికొండ రూరల్ డిసెంబర్ 29 యువతరం న్యూస్:
ఐదేళ్ల పాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32 వేల కోట్ల విద్యుత్ బారం మోపిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని ఎమ్మెల్యే కె.ఈ శ్యాం కుమార్ పత్తికొండ లోని తన కార్యాలయంలో విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్తు ప్లాంట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయకపోవడం, విద్యుత్ సరఫరా చేసే ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటి ఎన్నో కారణాలతో విద్యుత్ కొరత ఏర్పడగా అధిక ధరలకు వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి జగన్ ప్రజలపై రూ. 32 వేల కోట్ల అదురుబరాన్ని మోపాడు అన్నారు. అంతేకాకుండా విద్యుత్ సంస్థలపై అప్పులు, అప్పులకు వడ్డీలు ఇతరత్రా కారణాలకు సంబంధించి మొత్తం పై రూ 1,29,503 కోట్లు విద్యుత్ పైనే జగన్ ఖర్చు చేసాడు అన్నారు. ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయాక 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో 2014లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. 2019 వరకు ఐదేళ్ల పాలనలో విద్యుత్ లోటును అధిగమించి 2019లో వైసీపీ ప్రభుత్వానికి మిగులు విద్యుత్ అందించడం జరిగిందన్నారు. తప్పుడు నిర్ణయాలతో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి నేడు టిడిపి వళ్ల విద్యుత్ చార్జీలు పెరిగాయి అంటూ ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ వాళ్లు ఇకనైనా తప్పుడు సమాచారాన్ని మానుకోవాలని ఎమ్మెల్యే కేఈ హితవుపలికారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వైసీపీని ప్రజలు ఆదరించే పరిస్థితులు లేవని గుర్తుంచుకోవాలన్నారు. వైసిపి దొంగ నాటకాలతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు.