పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ

పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ
అమరావతి ప్రతినిధి ఏప్రిల్ 29 యువతరం న్యూస్:
నందమూరి నటసింహం బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన పంచెకట్టులో వెళ్లి అబ్బుపరిచారు. సినీరంగంలో విశేషంగా సేవలు అందించినందుకు గాను బాలకృష్ణకు పద్మభూషన్ ప్రకటించింది కేంద్రం. తాజాగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తరలి వెళ్లారు.
బాలకృష్ణ సినీ నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవకుడిగా చేస్తున్న కృషికి ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ.. ఇప్పటికే వందకు పైగా సినిమాలతో రాణిస్తున్నారు. ఈ వయసులో కూడా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేసిన బాలకృష్ణ.. తన తండ్రి లాగే ఎన్నో పౌరాణికి పాత్రలు కూడా చేశారు. ఇటు మాస్ తో పాటు క్లాస్ సినిమాలను కూడా చేశారు. సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి. తాజాగా భారత ప్రభుత్వం పద్మభూషన్ అందించింది. దీంతో బాలయ్యకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు విషెస్ చెబుతున్నారు.