

కర్నూలు అభివృద్ధికి భారీ పెట్టుబడులు
మంత్రి టీజీ భరత్
కర్నూలు ప్రతినిధి జూన్ 8 యువతరం న్యూస్:
కర్నూలులో నిర్వహించిన కాపు బలిజ సేవా సంఘం ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్ జిల్లాలో గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చామని చెప్పారు. ప్రారంభంలో రూ.2,500 కోట్లుగా భావించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టు ప్రస్తుతం రూ.6,000 కోట్లకు పైగా విస్తరించిందని, అదనంగా మరో రూ.3,000 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రాజెక్టును చేపట్టేందుకు సంస్థ ముందుకు వచ్చిందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లుకు నీటి సరఫరా లైన్ ఏర్పాటు కాలేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ పనిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్రస్తుతం ప్రభుత్వంపై నమ్మకంతో రూ.6,000 కోట్ల విస్తరణ ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న మంత్రి, ఈ అంశంపై ఎన్. చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ నిరంతరం సమీక్షిస్తున్నారని చెప్పారు. యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని, వారికి అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఇంజినీరింగ్ కళాశాలలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. అవినీతి మచ్చ లేకుండా తమ కుటుంబం రాజకీయాలు చేస్తోందని పేర్కొన్న మంత్రి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఎవరో, కేవలం మాటలు చెప్పే నాయకులు ఎవరో గుర్తించే అవగాహన ఉందన్నారు. కర్నూలు నగరంలోని ప్రతి వార్డులో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.



