రాష్ట్రంలో 7.7లక్షల ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లు


రాష్ట్రంలో 7.7లక్షల ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లు
రేపల్లె ఏప్రిల్ 13 యువతరం న్యూస్:
రాష్ట్రంలో 7.7 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలోని నగరం ఎస్టీ కాలనీలో ప్రతిష్టాత్మక “పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ జగజ్జీవన్ జ్యోతి యోజన” పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.8,848 కోట్ల వ్యయంతో 21 లక్షల సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ప్రతి లబ్ధిదారుడి ఇంటిపై 2 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ను మంత్రి అనగాని పరిశీలించి వాటి వినియోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశంలోని ప్రతి ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పానికి అనుగుణంగా ఈ పథకం అమలవుతోందని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



