యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి

యోగాతో విద్యార్థులకు జ్ఞాపకశక్తి
డాక్టర్ అనూష
మంగళగిరి ప్రతినిధి జూన్ 19 యువతరం న్యూస్:
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శరణాలయం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బాల బాలికలకు యోగశిక్షణ తరగతులు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగ శిక్షణా తరగతులను ప్రారంభించారు. బాల బాలికలకు శ్రీ రాధా కృష్ణా యోగ సేవా కేంద్రం ప్రధాన యోగాచార్యులు పడమట రాధాకృష్ణా యోగి గురూజీ బాల బాలికలకు యోగ సాధనపై శిక్షణ ఇచ్చారు. అనంతరం డాక్టర్ అనూష మాట్లాడారు. బాలబాలికలకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటి ఆధునిక యుగంలో విద్యలో పోటీ తత్వం పెరిగి విద్యార్థులలో ఒత్తిడి పెరుగుతుందన్నారు. యోగ సాధన వలన మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులు చదివిన పాఠ్యాంశాలు బాగా గుర్తుండి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. యోగ సాధన వలన కండరాలు బలోపేతం అవడం, రక్తపోటు నియంత్రణ, గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, నియంత్రిత శ్వాస వ్యాయామాలు ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందన్నారు. మునులు, ఋషులు అందించిన యోగ పై ప్రతి ఒక్కరు ఆసక్తిని పెంచుకొని, యోగ సాధన చేయడం అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష, రాధాకృష్ణా యోగి గురూజీలను శరణాలయం బాలబాలికలు, నిర్వాహకులు శాలువాలతో సత్కరించి, బొకే, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శరణాలయం నిర్వాహకరాలు శ్రీమతి సంధ్యారాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.