మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి
మహిళల ఆర్థిక స్వాలంబనకు తోడ్పాటు అందించండి
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో జూన్ 18 యువతరం న్యూస్:
మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారి ఆర్థిక స్వలంబనకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మెప్మా పిడి, మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమీషనర్లు, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక లక్ష్యం 221 యూనిట్ల నెలకొల్పనకు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో 111, ఆళ్లగడ్డలో 24, ఆత్మకూరులో 19, బేతంచెర్లలో 17, డోన్ లో 26, నందికొట్కూరులో 24 యూనిట్లను స్థాపించి మహిళల జీవనోపాధి, ఆర్థిక స్వాలంబనకు తోడ్పాటును అందించి ప్రోత్సహించాలని కలెక్టర్ మున్సిపల్ కమీషనర్లు, మెప్మా అధికారులను ఆదేశించారు. అలాగే ఓఎన్డిసి సైట్ లో స్వయం సహాయక సంఘాల మహిళలు విక్రయించే ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సాహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకర్లు రుణాలు అందించడంలో కూడ ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు.