ANDHRA PRADESHEDUCATIONOFFICIAL

విద్యార్థుల ప్రతిభకు ఉత్తమ పురస్కారాలు

విద్యార్థుల ప్రతిభకు ఉత్తమ పురస్కారాలు

విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు

182 మంది టెన్త్‌ విద్యార్థులకు, 35 మంది ఇంటర్‌ విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు ప్రధానం

పట్టుదల, కృషితో ఉన్నత స్థానాలను అధిరోహించండి

రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల బ్యూరో జూన్ 10 యువతరం న్యూస్:

టెన్త్‌, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులను ప్రకటించిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం చాబోలు రోడ్డులోని ఎఎస్ఆర్ కళ్యాణ మండలంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల పురస్కారం-2025 కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఎంపిపి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమాంత్ కుమార్, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రెడ్డి, జిల్లా అధికారులు, విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ టెన్త్‌, ఇంటర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు-2025 పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, రూ.20 వేల నగదు బహుమతి, అప్రిసియేషన్ సర్టిఫికెట్‌తో సత్కరించాన్నారు. విద్యలో నాణ్యత, నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 182 మంది టెన్త్‌ విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్‌ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన 35 మంది ఇంటర్‌ విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు ప్రధానం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలలో చదివిన విద్యార్థులనే భేదభావం లేకుండా పదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన వారిని ప్రోత్సహించడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి విద్యార్థులను మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. పట్టుదలతో కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు అధిగమించాలన్నారు. 10వ తరగతిలో జిల్లాలో 82 శాతం ఉత్తీర్ణత సాధించడం ద్వారా రాయలసీమ జిల్లాలలో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టడం జరిగిందన్నారు. అదే విధంగా విద్యార్థుల్లో సాంకేతికతను పెంచడానికి నాక్ విద్యా విధానాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్య శిక్షణ వైపు కూడా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని కోరగా అందుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అలోచనల మేరకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించేందుకు గాను ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేయడమే కాకుండా ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలనే తారతమ్యం లేకుండా కేవలం ప్రతిభనే కొలమానంగా తీసుకుంటూ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నతస్థాయికి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అందుకు తగ్గ కృషి చేయాలన్నారు. విద్యార్థులు కోర్ సబ్జెక్టు తో పాటు ఇతర నైపుణ్య మెలకువలను కూడా అభివృద్ధి చేసుకోవడం ద్వారా విద్యార్థులో నాయకత్వ లక్షణాలు అలవర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అన్ని విధాలుగా ఉత్సాహపరుస్తూ ఏ ఒక్క పరీక్షలో తప్పినా వారిని నిరుత్సాహపరచకుండా వెన్ను దట్టి ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో విద్యార్థినిల ఉత్తీర్ణత 60 శాతం పైగా ఉందని మరింత పెంచేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా పదవ తరగతిలో తప్పిన పిల్లలకు కూడా అవసరమైన సహాయ సహకారాలను అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతోందన్నారు. విద్యార్థులు కూడా వారి ప్రతిభను దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు ఉపయోగపడేలా కృషి చేయాలన్నారు.

అంతకుముందు విద్యార్థులు, తల్లిదండ్రులు వారి మనోభావాలను పంచుకున్నారు. అనంతరం విద్యార్థులకు మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్, మెడల్, 20వేల నగదు బహుమతిని అందజేశారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!