ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే

ప్రపంచరికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే
విశాఖలో లక్షల మందితో కలసి ప్రధాని యోగాసనాలు
మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్
జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులలో కార్యక్రమాల నిర్వహణ
ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో ఈ నెల 21న ఆర్ కె బీచ్ వద్ద ప్రాథమిక వేడుకలు
ఆర్కె బీచ్ నుంచి భీమిలి వరకు సముద్ర తీరం పొడవునా యోగా డే నిర్వహణ
జూన్ 21 విశాఖలో ప్రధాని పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సమీక్ష.
ఉత్తరాంధ్ర ప్రతినిధి మే 21
యువతరం న్యూస్:
ప్రపంచరికార్డు సృష్టించేలా 11వ అంతర్జాతీయ యోగా డేను తేదీ జూన్ 21న విశాఖ జిల్లాలో నిర్వహించేందుకు ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నందున, ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు “యోగా మంత్” పాటించాలని, ఈ నెల రోజులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలన్నారు. ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్గా ప్రభుత్వం తీసుకున్నదని, అందువల్ల జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలని, ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. ‘యోగాంధ్ర-2025’ థీమ్తో ప్రచారం చేపట్టి ప్రజలను సన్నద్ధం చేసేందుకు నెలరోజుల పాటు ప్రజలకు యోగా పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలని, అదే విధంగా స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను, డ్వాక్రా మహిళలను, ప్రైవేటు ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆర్ కె బీచ్లో దేశప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు, అదే విధంగా పార్క్ హోటల్ నుండి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆర్కే బీచ్, రుషికొండ, స్కూల్స్, క్రికెట్, పోలీస్, స్పోర్ట్చ్, నావీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించడం జరిగిందన్నారు.
అంతర్జాతీయ యోగ డే విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో మరియు గ్రామ/ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, డ్రోన్స్, డ్రింకింగ్ వాటర్, అల్పాహారము, రవాణా సదుపాయము, వాహనాల పార్కింగ్, శానిటేషన్, టాయిలెట్స్, వాలంటీర్లు ఏర్పాటు, మెడికల్ టీమ్ ల ఏర్పాటు, అతిధులకు అకామిడేషన్ మరియు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు
యోగాలో ప్రపంచరికార్డ్ నెలకొల్పాలి.
యోగా దినోత్సవాన్ని ప్రకటించి 10 ఏళ్లు పూర్తియిన సందర్భంగా, ప్రధాని పాల్గొనే 11వ అంతర్జాతీయ యోగ డే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు. 2023లో సూరత్లో 1.53 లక్షల మందితో ఒకే చోట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపి వరల్డ్ రికార్డ్ను సాధించింది. సూరత్ తరహాలో విశాఖలోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించి… ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని, అందుకు అధికారులు ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 2.50 లక్షల మందిని భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్ల సమన్వయంతో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు అక్కడ నుంచి విజయనగరం జిల్లా మీదుగా శ్రీకాకుళం వరకు సుమారు 5 లక్షల మందిని భాగస్వామ్యం చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
యోగ శిక్షకుల ద్వారా శిక్షణలు ప్రారంభించాలని చెప్పారు. దీనిలో భాగంగా మాసోత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 6.30 నుంచి 8.00 గంటల మధ్యలో విశాఖ ఆర్ కె బీచ్ రోడ్లో 1000 మందితో ప్రాథమిక వేడుకులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మే21నుంచి మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డిసిపి లు మేరీ ప్రశాంతి, అజిత, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్ తో పాటు జిల్లా అధికారులు, యోగా టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.