రాజాధిరాజా వాహనంపై నరసింహుడు

రాజాధిరాజా వాహనంపై నరసింహుడు
మంగళగిరి ప్రతినిధి మార్చి 8 యువతరం న్యూస్:
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన శనివారం స్వామివారు రాజాధిరాజా వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనంపై అధిష్టింప చేసి రంగు రంగు పూలమాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు ఆ విద్యుత్ కాంతుల మధ్య పెండ్లి కుమారుడైన నరసింహుడు దేదీప్యమనంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంతపద్మనాభచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. 14 లోకములకు అధిపతి లోకనాథుడని ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించి శిరస్సు వంచి వినమ్రత దాసోహం సమర్పించిన వారి అందరిని కరుణించేటటువంటి భక్త సంరక్షకుడు స్వామి అన్నారు. దీనజన బంధువు భక్తజన సంరక్షణ కంకణ బద్ధుడై రాజాధిరాజ వాహనారూడుడై దర్శనం ఇస్తారన్నారు. ఉత్సవాన్ని దర్శించిన వారందరూ సుఖసంతోషాలతో వెలుగొందుతారన్నారు. గ్రామోత్సవం దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమై మెయిన్ బజార్, సాదు సోడా సెంటర్, పూల మార్కెట్ సెంటర్ మీదుగా మిద్దె సెంటర్ వరకు సాగింది. విచిత్ర వేషధారణలు, బాణాసంచా పేలుళ్లు, మేళతాళాలు, కనక తప్పట్లు మధ్య ఉత్సవం నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యల హాజరై స్వామివార్లను దర్శించుకుని, టెంకాయలు కొట్టి, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి పెదపాలెంకు చెందిన పెమ్మసాని శైలేంద్ర కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వాహణాధికారి అన్నపురెడ్డి రామకోటి రెడ్డి పర్యవేక్షించారు.